న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెల 10 నుంచి బీమా సంస్థ ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేస్తే చాలు. ప్రతి శనివారం కూడా సెలవు దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 15వ తేదీని దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎల్ఐసీ ఆఫీసులు తెరిచి ఉంటాయి. నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్స్ 1881 చట్టానికి సవరణ తీసుకువచ్చి ప్రతి శనివారాన్ని పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న 1.14 లక్షల మంది ఎల్ఐసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది.
దీనికితోడు ఎల్ఐసీ ఉద్యోగులకు జీతాల పెంపుపై కూడా కేంద్రం తుది నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లకు 15-16 శాతం పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 20 శాతం వరకూ కూడా ఉండొచ్చని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఎల్ఐసీ ఐపీవోకు వెళ్తున్న సమయంలో జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంటుండటం విశేషం.