బాధితులకు మంత్రి జగదీశ్రెడ్డి పరామర్శ
జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్లో అపశృతి చోటు చేసుకుంది. మైదానంలో వీక్షకుల కోసం భారీ ఏర్పాట్లు చేయగా.. తూర్పు వైపు ఉన్న గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వంద మందికి పైగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన సూర్యపేట జిల్లా దవాఖానతో పాటు పలు ప్రైవేట్ హాస్పిటల్స్కు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం నార్కట్పల్లి, హైదరాబాద్లోని దవాఖానల్లో చేర్పించారు. జిల్లా కేంద్ర దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, లింగయ్య పరామర్శించారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇదిలా ఉంటే జరిగిన ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.