గువాహటి: సరిహద్దుల్లో ఘర్షణకు సంబంధించి మిజోరం పోలీసులు తనపైన, తన ప్రభుత్వంలోని నలుగురు ఉన్నతాధికారులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ( Himanta Biswa Sarma ) తప్పుపట్టారు. ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని సజీవంగా ఉంచడమే తమ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఏదేమైనా సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ రెండు రాష్ట్రాలకు మంచిది కాదని చెప్పారు. మిజోరం సీఎం జొరామ్తంగ క్వారెంటైన్ ముగిసిన తర్వాత తనతో ఫోన్లో మాట్లాడుతానని చెప్పారని తెలిపారు.
సమస్య ఏదైనా చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని, కేసులతో సమస్యలు పరిష్కారం కావని హిమాంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. నాపై కేసు నమోదు చేయడంతో సమస్యకు పరిష్కారం లభిస్తుందంటే సంతోషమేనని, అందుకు తాను ఏ పోలీస్స్టేషన్కు పిలిచినా వెళ్తానని చెప్పారు. కానీ, తన అధికారులపై కేసులు వేసి దర్యాప్తు జరుపుతామంటే మాత్రం తాను అస్సలు అంగీకరించబోనని చెప్పారు. అవసరమైతే సరిహద్దు సమస్య పరిష్కారం కోసం తాను సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు.