కంటోన్మెంట్ : ఖాకీలలో కాఠిన్యమే కాదు.. కరుణ కూడా ఉంటుందని నిరూపించారు కార్ఖానా పోలీసులు. బుధవారం కార్ఖానా పోలీస్స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ సమీపంలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది. ఇది గమనించిన పెట్రోకార్ సిబ్బంది ఆ వృద్ధురాలిని పోలీస్ స్టేషన్కు తీసుకురాగా అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ సౌజన్య చేరదీసి కొబ్బరి నీళ్లు తాగించింది. ఆమె యోగక్షేమాలు తెలుసుకొని రసూల్పురాలో ఉంటున్న కూతురికి సమాచారం చేరవేసింది. అనంతరం కుటుంబ సభ్యులు వచ్చి వృద్ధురాలిని తీసుకు వెళ్లారు. నూతనంగా విధుల్లో చేరిన సౌజన్య వృద్ధురాలికి సేవ చేయడంతో తోటి ఉద్యోగులు ప్రశంసలతో ముంచెత్తారు. దీనిపై కార్ఖానా ఇన్స్పెక్టర్ పరావస్తు మధుకర్స్వామి స్పందిస్తూ కానిస్టేబుల్ సౌజన్య మానవతా దృక్పథంతో వృద్ధురాలికి సేవ చేయడం అభినందనీయమన్నారు.