ముంబై, జూన్ 16: 12వ తరగతి విద్యార్థులకు మార్కులను ఏ విధంగా లెక్కగట్టాలన్న అంశంపై సీబీఎస్ఈ ఏర్పాటు చేసిన 13 సభ్యుల కమిటీ తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. విద్యార్థుల 10, 11వ తరగతుల తుది ఫలితాలు, 12వ తరగతి ప్రీఫైనల్ మార్కుల ఆధారంగా 12వ తరగతి మార్కులను కేటాయించనున్నట్టు తెలుస్తున్నది. నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నదని పాఠశాలల ప్రిన్సిపాళ్లు తెలిపారు. మార్కుల కేటాయింపులో 10వ తరగతి మార్కులకు 30%, 11వ తరగతి మార్కులకు 30%, 12వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కులకు 40% వెయిటేజీ ఇవ్వనున్నారని వారు పేర్కొన్నారు. మార్కుల లెక్కింపు విధానాన్ని ఈ కమిటీ గురువారం సుప్రీంకోర్టుకు సమర్పిస్తుందని, ఆ తర్వాత ప్రకటిస్తుందని తెలిపారు.