నిర్మల్టౌన్, మార్చి 23 : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. విధి నిర్వహణలో పోలీసు శాఖలో కూడా 30శాతం ఫిట్మెంట్తో పాటు ఉద్యోగ విరమణ వయస్సు మూడేండ్లు పెంచింది. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ బెనిఫిట్స్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. దీంతో నిర్మల్ జిల్లాలో పోలీసు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ, హోంగార్డులకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించగా.. ఇప్పుడు రెండో విడుత పీఆర్సీతో ప్రయోజనం చేకూర్చడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 682 మందికి పైగా ఉద్యోగులు ఉండగా.. అందులో 220 మంది హోంగార్డులున్నారు. వీరం దరికీ ప్రభుత్వ ప్రయోజనం దక్కనుంది.
సంతోషం అనిపించింది..
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. కొత్తగా పోలీసు నియామకాలను చేపట్టింది. ఇప్పుడేమో ఉద్యోగులకు 30శాతం పీఆర్సీని ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను పదేండ్ల నుంచి పోలీసు శాఖలో పనిచేస్తున్నా. నాకు ఇప్పుడు రూ.24 వేల జీతం వస్తున్నది. పీఆర్సీతో రూ.40 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
తెలంగాణ ప్రభుత్వంలోనే గుర్తింపు..
నేను పట్టణంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా. పీఆర్సీ కోసం మూడేండ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ 30శాతం పీఆర్సీని ప్రకటిండం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ ప్రజల రక్షణ కోసం పాటు పడే మా సేవలను గుర్తించి పీఆర్సీతో పాటు ఇతర ప్రయోజనాలను కల్పిస్తామని హామీనివ్వడం చాలా ఆనందంగా ఉంది. అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తా.