న్యూఢిల్లీ: దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, తమ సర్కారు అదేపని చేస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ ( PM Modi ) అన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకం బలోపేతం కావడంవల్ల యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. అంతేగాక యువతకు మన దేశ గత సంస్కృతి గురించి తెలుస్తుందన్నారు. భయాలు విశ్వాసాన్ని దెబ్బతీయలేవని, మనం గతం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నదని ప్రధాని పేర్కొన్నారు.
ఇవాళ ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్లోని సోమ్నాథ్ పట్టణంలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమ్నాథ్ ప్రోమనేడ్, సోమ్నాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పార్వతీ టెంపుల్, ఓల్డ్ సోమనాథ్ టెంపుల్ ప్రహరీ పునర్నిర్నాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భారతదేశ పురాతన చరిత్ర గొప్పతనాన్ని గురించి ప్రస్తావించారు.