న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసికి చెందిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. కొవిడ్-19తో పాటు ప్రధాన సవాల్ గా ముందుకొచ్చిన బ్లాక్ ఫంగస్ నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రధాని కోరారు. కరోనా మహమ్మారి సమసిపోయేవరకూ ప్రజలు సేదతీరరాదని స్పష్టం చేశారు.
కొవిడ్-19పై మనం పోరాడుతుండగానే బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సవాల్ ఎదురైందని దీన్ని సమర్ధంగా ఎదుర్కొనేందుకు మనం జాగ్రత్తలు పాటిస్తూ సంసిద్ధం కావాలని అన్నారు. కరోనా కట్టడిలో వారణాసి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సేవలను ప్రధాని ప్రశంసించారు. తక్కువ సమయంలోనే నగరంలో ఆక్సిజన్ పడకలు, ఐసీయూ పడకలను పెద్ద సంఖ్యలో విస్తరించారని కొనియాడారు.