చండీగఢ్: హర్యానా రాష్ట్రం నుంచి భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకాలు సాధించి వచ్చే వారిపై ఆ రాష్ట్ర సర్కారు కాసుల వర్షం కురిపించబోతున్నది. పతకాలు సాధించిన వారికేగాక కొద్ది తేడాతో పతకాన్ని చేజార్చుకున్న వారికి కూడా ఈ సారి నగదు ప్రోత్సాహకాలు అందించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టరే ( Manohar Lal Khattar )స్వయంగా మీడియాకు వెల్లడించారు.
ఖట్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించి వచ్చిన వారికి హర్యానా ప్రభుత్వం రూ.6 కోట్లను ప్రోత్సాహకంగా అందించనున్నది. అదేవిధంగా రజత పతకం సాధించిన వారికి రూ.4 కోట్లను, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2.5 కోట్లను ప్రభుత్వం ప్రోత్సాహక బహుమానంగా ఇవ్వనుంది. అంతేగాక గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి పతకాన్ని తృటిలో చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా రూ.50 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించనున్నట్టు ఖట్టర్ చెప్పారు.