ముంబై: తౌటే తుఫాను ధాటికి అరేబియా సముద్రంలో కొట్టుకుపోయి 61 మంది ప్రాణాలు కోల్పోయిన పీ-305 నౌక విషాద ఘటనకు ఓఎన్జీసీ సంస్థ నిర్లక్ష్యమే కారణమని శివసేన ఆరోపించింది. శనివారం ఈ మేరకు ఆ పార్టీ పత్రిక సామ్నాలో ఒక సంపాదకీయం వెలువడింది. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించింది. కాగా, ఈ విషాద ఘటనలో మరణించిన వారిలో 30 మంది మృతదేహాలు గుర్తుపట్టడానికి వీలులేకుండా ఉన్నాయని పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలో తుఫానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో తాను కేవలం మూడు గంటలే పర్యటించానన్న బీజేపీ విమర్శలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ.. ‘కనీసం నేను తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి పరిస్థితిని సమీక్షించాను. హెలికాప్టర్లో కూర్చొని ఫోటోలు తీసుకోలేదు కదా’ అని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ కౌంటర్ ఇచ్చారు.