న్యూఢిల్లీ: బీజేపీకి భయపడేవారు కాంగ్రెస్ పార్టీ నుంచి స్వేచ్ఛగా వెళ్లవచ్చని రాహుల్ గాంధీ అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మేవారు తమకు అవసరం లేదన్నారు. గత నెలలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద నుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్లో కొత్తగా నియమితులైన వాలంటీర్లతో రాహుల్ గాంధీ శుక్రవారం మాట్లాడారు. బీజేపీ ‘నకిలీ వార్తలకు’ భయపడవద్దని వారికి సూచించారు. యూపీలో కరోనా నియంత్రణ, చైనాతో ఘర్షణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నకిలీ వార్తల గురించి మాట్లాడే ప్రధాని మోదీని ప్రజలు నమ్మడం లేదని తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ వ్యతిరేకులను ఆర్ఎస్ఎస్ వ్యక్తులతో రాహుల్ గాంధీ పోల్చారు. బీజేపీకి భయపడే అలాంటి వారు కాంగ్రెస్ను వీడవచ్చని వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే భయం లేని వారు తమకు కావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో లేని చాలా మంది నిర్భయులు బయట ఉన్నారని, అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుందన్నారు.