ఈ నెల 9 నాటికి ఖమ్మం జిల్లాలో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ ఉండాలి
లాక్డౌన్ సత్ఫలితాలు ఇచ్చింది
అధిక కేసుల నమోదుకు కారణాలను అన్వేషించాలి
మధిర, సత్తుపల్లిలో వైద్య శాఖ సమీక్షలో రాష్ట్ర వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి
బోనకల్లు/ సత్తుపల్లి/ సత్తుపల్లి రూరల్, జూన్ 1: సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ సత్ఫలితాలు ఇచ్చిందని, కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎం రిజ్వి అన్నారు. ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి పట్టణాల్లో వైద్యారోగ్యశాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో కొవిడ్ ఉధృతిని ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు.
రాష్ట్రంలో లాక్డౌన్ సత్ఫలితాలు ఇచ్చిందని, కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎం రిజ్వి అన్నారు. మధిర, సత్తుపల్లిల్లో ఆయన పర్యటించారు. మధిరలోని రెడ్డి గార్డెన్స్లో ఖమ్మం కలెక్టర్ కర్ణన్ అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా వైద్యారోగ్యశాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం గ్రామాల్లో కొవిడ్ ఉధృతిని ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వే వల్ల పాజిటివ్ శాతాన్ని నియంత్రించగలిగామని అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు జీ.శ్రీనివాసరావు మాట్లాడుతూ సెకండ్ వేవ్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున శాఖలు సమన్వయంతో వైరస్ను కట్టడి చేయాలని సూచించారు. సీఎంవో ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ కుటుంబంలో ఒకరికి పాజిటివ్ ఉంటే అతణ్ని వెంటనే ఐసొలేషన్ కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్సిజన్, ఇంజక్షన్ల కొరత లేదన్నారు. కేఎంసీ కమిషనర్ అనురాగ్జయంత్, డీఎంహెచ్వో మాలతి, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కారణాలను అన్వేషించాలి
కొవిడ్ పాజిటివ్ శాతాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి ఆదేశించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని పీహెచ్సీ వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఇతరశాఖల అధికారులతో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాజిటివిటీ అధికంగా నమోదు కావడానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించి పటిష్ట ప్రణాళికలతో కట్టడి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజారోగ్య శాఖ సంచాలకుడు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్సిజన్, ఔషధాల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, ప్రతిరోజూ అన్ని జిల్లాల వైద్యాధికారులతో సమీక్షిస్తున్నామని అన్నారు. సీఎంవో ఓఎస్డీ గంగాధర్, ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్, డిప్యూటీ డీఎంహెచ్వో సీతారాం, కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, జిల్లా క్షయనివారణ అధికారి సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ మీనన్, ఎంపీడీవో సుభాషిణి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సండ్ర వినతి
శిథిలావస్థకు చేరిన సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు నూతన భవనాలు మంజూరు చేయాలని, వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య మంగళవారం సత్తుపల్లి వచ్చిన రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ మూర్తుజా రిజ్వికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీతో సండ్ర సమావేశమయ్యారు. నియోజకవర్గంలో కరోనా తీవ్రత సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కేబినెట్లో చర్చించారని, ఆయన ఆదేశాలతో రాష్ట్ర స్థాయి అధికారులు సత్తుపల్లి వచ్చి ఇక్కడి అధికారులతో చర్చించడం శుభపరిణామమని అన్నారు. రాష్ట్ర వైద్యశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.