న్యూఢిల్లీ, మార్చి 12: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధికంగా సంపదను పెంచుకున్న పారిశ్రామిక దిగ్గజాల్లో భారత్కు చెందిన గౌతమ్ అదానీ అగ్రగణ్యుడిగా నిలిచారు. 2021 జనవరి నుంచి ఇప్పటివరకు ఆయన సంపద ఏకంగా 16.2 బిలియన్ డాలర్లు (రూ.1.2 లక్షల కోట్లు) పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది అదానీ గ్రూపునకు చెందిన వివిధ కంపెనీల షేర్లలో ఒక్కటి మినహా మిగిలినవన్నీ అనూహ్యంగా 50 శాతం పైబడి పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణమని బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. వీటిలో అదానీ టోటల్ గ్యాస్ షేర్ల విలువ 96 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 90 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు 79 శాతం పెరగ్గా.. అదానీ పవర్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ లిమిటెడ్ లాంటి కంపెనీల షేర్లు 52 శాతం మేరకు పుంజుకున్నాయి. కానీ అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు మాత్రం 12 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి. గతేడాది ఈ కంపెనీ షేర్ విలువ ఏకంగా 500 శాతం మేర పెరగడం గమనార్హం. సంపద పెంపులో ఈసారి ప్రపంచ అపర కుబేరులు జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ కంటే గౌతమ్ అదానీ ఎంతో ముందుండటం విశేషం. ఇదే సమయంలో ముకేశ్ అంబానీ సంపద పెరుగుదల 8.1 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. పోర్టులు, ఎయిర్పోర్టులు, బొగ్గు గనులు, విద్యుత్ ప్లాంట్ల లాంటి వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపారాలు నడుస్తున్నాయి.