న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ, దాని చుట్టుపక్కన ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోతగా వాన కురిసింది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో రాజధాని, సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదించింది. ఢిల్లీతోపాటు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 21 డిగ్రీలకు పడిపోయిందని వెల్లడించింది.
ఢిల్లీతోపాటు సమీప రాష్ట్రాల్లోని గురుగ్రామ్, గోహానా, మనెసర్, గన్నౌర్, ఔరంగాబాద్, పల్వాల్, ఫరీదాబాద్, బల్లభ్గర్, పానిపట్, సొహానా, నోయిడా, ఘజియాబాద్, నార్నుల్, కర్నాల్, గ్రేటర్ నోయిడా, ముజఫర్నగర్, హస్తినాపూర్, మీరట్తోపాటు పలు ప్రాంతాల్లో వచ్చే రెండు గంటల్లో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.