హైదరాబాద్ : తొలకరి జల్లులతో ప్రకృతిలో ఎటుచూసిన పచ్చదనమే కనువిందు చేస్తుంది. బ్రాగన్జా ఘాట్స్లోని హుబ్లీ-గోవా సెక్షన్ మరింత రమణీయంగా మారింది. ఇక్కడి ఎత్తైన ఘాట్ల నుంచి అసంఖ్యాకంగా జాలువారుతున్న జలపాతాలు స్వర్గంలోని ఓ భాగమా? అన్నట్లు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, కురుస్తున్న జోరువానలో తెల్లటి పాల నురగల వలె జాలువారుతున్న జలపాతాలను చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. గోవా-కర్ణాటక సరిహద్దు కొండ ప్రాంతం బ్రాగంజా ఘాట్స్. 26 కిలోమీటర్ల ఘాట్ సెక్షన్ రైలు రహదారి తీరప్రాంత గోవాను కర్ణాటక, ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. ఈ మార్గంలో ప్రయాణం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తుంది.