పుణె, ఆగస్టు 10: పుష్కలంగా వానలు పడుతున్నా బీజేపీ పాలిత మహారాష్ట్రలోని పుణెలో నీటి సంక్షోభం నెలకొన్నది. నీటి కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన 11 హౌసింగ్ సొసైటీలు, అసోసియేషన్లు బాంబే హైకోర్టును తాజాగా ఆశ్రయించాయి. పైప్లైన్ లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రతి పౌరుడికి రోజుకు 135 లీటర్ల ఇచ్చేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరాయి. కేంద్రం అంచనా ప్రకారం.. ఒక రోజులో ఒక పౌరుడికి నీటి అవసరాల కోసం 135 లీటర్లు కావాలని, అయితే ప్రస్తుతం పుణె జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ కాంప్లెక్స్లకు స్థానిక పాలక సంస్థల నుంచి 25 లీటర్ల కంటే తక్కువగా లేదా అసలు అందడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చాయి.
రోజువారీ నీటి అవసరాలు, తాగునీటి కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నదని, నీటి కొనుగోలుకు పట్టణవాసులతో పాటు హౌసింగ్ సొసైటీలు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ యాజమాన్యాలు భారీ మొత్తంలో డబ్బు వెచ్చిస్తున్నాయని తెలిపాయి. కొన్ని సందర్భాల్లో అయితే గృహ అవసరాల కోసం నీటి కొనుగోలుకు ఒక హౌసింగ్ సొసైటీ ఏడాదికి రూ.1.5 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తున్నదని కోర్టు పేర్కొన్నాయి.
వాటర్ ట్యాంకర్ మాఫియా చేతుల్లో పుణె జిల్లాలోని పట్టణ ప్రాంతాలు చిక్కుకొని ఉన్నాయని, ప్రజలు కలుషిత నీరు తాగాల్సి వస్తుందని పిటిషన్ పేర్కొన్నది. నీటి సమస్యపై స్థానిక ఎన్జీవోలు, రెసిడెంట్ అసోషియన్లు పలుమార్లు అధికారులను కలిశాయని, అయితే పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
అదేవిధంగా బిల్డర్లు యథేచ్చగా బోర్లు తవ్వుతూ.. బాధ్యత లేకుండా భూగర్భ నీటిని వాడేస్తున్నారని తెలిపింది. గత నాలుగేండ్లుగా పుష్కలంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, జిల్లాలోని పట్టణవాసులు తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. నదులు, సరస్సులు వంటి నీటి వనరుల అభివృద్ధి, పరిరక్షణను పాలకులు విస్మరిస్తున్నారని పేర్కొన్నది.