కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఖేలా హోబ్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. సోమవారం కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె వేదికపై కాసేపు ఫుట్బాల్తో ఆడుకున్నారు. ఆ తర్వాత ఒక్కో బంతును కార్యక్రమానికి హాజరైన జనంలోకి విసిరేశారు. అనంతరం సమావేశంలో ప్రసంగించిన ఆమె.. ఖేలా హోబ్ నినాదం చాలా పాపులర్ అవుతుందని చెప్పారు.
మీరు నమ్మండి, నమ్మకపోండి.. ఖేలా హోబ్ నినాదం చాలా పాపులర్ అవుతుంది. ఇటీవల ఈ నినాదం పార్లమెంటులో కూడా మార్మోగింది. త్వరలోనే ఈ నినాదం దేశమంతా వ్యాప్తి చెందుతుంది అని మమతాబెనర్జి వ్యాఖ్యానించారు. తృణమూల్ నేత దేవాన్షు భట్టాచార్జి రాసిన ఖేలా హోబ్ గేయం.. ఈ ఏడాది ప్రారంభంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో మార్మోగింది. ఒక రకంగా బెంగాల్లో టీఎంసీ విజయం సాధించడానికి కూడా కారణమైంది. ఇప్పుడు ఈ గేయం పేరుతోనే మమతా బెనర్జి ఖేలా హోబ్ అనే ప్రోగ్రామ్ను ప్రారంభించారు.