సూరత్: గుజరాత్లోని సూరత్ జూపార్కుకు కొత్తగా రెండు తెల్ల పులులు ( White Tigers ) వచ్చాయి. అదే రాష్ట్రంలోని రాజ్కోట్ జూపార్కు నుంచి ఒక ఆడ పులిని, ఒక మగ పులిని సూరత్ జూపార్కుకు తీసుకొచ్చారు. జూపార్కుల మధ్య జంతువుల మార్పిడి ప్రోగ్రామ్ కింది ఆ రెండు తెల్ల పులులను రాజోకోట్ జూపార్కుకు తెచ్చినట్లు సూరత్ జూ అధికారులు తెలిపారు. కొత్తగా వచ్చిన ఆ రెండు పులుల్లో ఆడ పులి పేరు గిరిమ అని, మగ పులి పేరు గౌరవ్ అని అధికారులు వెల్లడించారు.
ఈ రెండు పులుల వయసు ఒక్కటేనని, వాటికి రెండు సంవత్సరాల నాలుగు నెలల వయసు ఉంటుందని అధికారులు చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ రెండు తెల్ల పులులను 10 నుంచి 15 రోజులపాటు క్వారెంటైన్లో ఉంచుతామని, క్వారెంటైన్ అనంతరం ప్రజల సందర్శనార్థం ఎన్క్లోజర్లకు తరలిస్తామని తెలిపారు.