న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా ఉభయసభలు సజావుగా సాగడంలేదు. ప్రతిపక్షాలు పెగాసస్, ద్రవ్యోల్బణం, వ్యవసాయ చట్టాలపై చర్చకు పట్టుబడుతుండగా.. ప్రభుత్వం అందుకు ససేమిరా అంటున్నది. దాంతో పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది.
అదేంటంటే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్వాది పార్టీ (బీఎస్పీ), శిరోమణి అకాలీదల్ (ఎస్ఏడీ) పార్టీల ఎంపీలు గత కొన్ని రోజులుగా పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా వారు ఆందోళన కొనసాగిస్తుండగా.. అలనాటి అందాల తార, బీజేపీ ఎంపీ హేమామాలిని పార్లమెంటు లోపలికి వస్తూ కనిపించారు. దాంతో అక్కడే ఉన్న శిరోమణి ఎంపీ హర్సిమ్రత్ కౌర్ ఆమెను పిలిచి ఒక గోధుమ కంకి ఇచ్చారు.
ఈ సందర్భంగా తమ ఆందోళనకు మద్దతు తెలుపాలని, రైతులకు అండగా నిలువాలని హేమమాలినిని హర్సిమ్రత్ కోరారు. రైతులకు అండగా నిలబడుదాం అని రాసి ఉన్న ప్లకార్డును ఆమెకు చూపించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. అనంతరం హేమామాలిని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడండి.