ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) జరిగింది. జోగేశ్వరి ఏరియాలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ దాని ముందు వెళ్తున్న బైకును ఢీకొట్టింది. దాంతో బైక్పై వెళ్తున్న ఎగిరిపోయి దూరంగా పడ్డాడు. అనంతరం లారీ ఎదురుగా వచ్చిన ఓ బస్సును కూడా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇంత ఘోరంగా జరిగిన ప్రమాదంలో కేవలం ఇద్దరు మాత్రమే తీవ్రంగా గాయపడటం సంతోషించదగ్గ విషయం.
ఎందుకంటే లారీ బైకును ఢీకొట్టిన దృశ్యం చూస్తే ఆ బైకుపై వెళ్తున్న వ్యక్తి బతికే ఉంటాడని ఎవరూ ఊహించరు. కానీ అతను తీవ్రంగా గాయపడ్డా ప్రాణాలు మాత్రం దక్కాయి. అతనితోపాటు ఎదురుగా వచ్చిన మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ దిగి పారిపోతున్న దృశ్యం సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్నది. దాంతో పోలీసులు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు.