భువనేశ్వర్: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్ర ఘనంగా కొనసాగుతున్నది. కరోనా మహమ్మారి విస్తరణ కారణంగా గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం భక్తులను అనుమతించకపోయినా.. పూరీ రాజు, వేది పండితులు, ఆలయ అర్చకులు, సిబ్బంది కలిసి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ శుక్ల విదియ నాడు అంటే ఇవాళ.. వేద పండితులు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి ‘మనిమా’ (జగన్నాథా) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఉత్సవమూర్తులను కదిలించడం ద్వారా రథయాత్రా పర్వం మొదలైంది.
అనంతరం ఉత్సవమూర్తులైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులను ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేశారు. ఈ ఉత్సవాన్ని ‘పహండీ’ అంటారు. ఆ తర్వాత గుండిచా ఆలయానికి వెళ్లేందుకు ఉత్సవమూర్తులు రథంపై సిద్ధమై ఉండగా.. ‘ఇలపై నడిచే విష్ణువు’గా గౌరవాభిమానాలను అందుకునే పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన పరమాత్ముడి ముందు సేవకుడిగా మారి బంగారు చీపురుతో రథాలను ఊడ్చాడు. దీన్నే ‘చెరా పహారా’ అంటారు.
మహారాజు బంగారు చీపురుతో రథాలను ఊడ్చిన అనంతరం రథయాత్ర మొదలైంది. పూరీ ఆలయంలో జరిగిన ఈ సంప్రదాయ కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు..