జైపూర్: రాజస్థాన్లోని టోంక్ పట్టణంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈ సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి ( Heavy rain ) టోంక్ పట్టణం ఉక్కిరిబిక్కిరయ్యింది. భారీగా వరదలు పోటెత్తడంతో వీధులన్నీ నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలుచోట్ల దుకాణాల్లోకి, ఇండ్లలోకి వరదనీరు చేరింది. భారీ వరదల కారణంగా రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.
లోతట్టు ప్రాంతాల్లో వరదల ప్రభావంతో ఇండ్ల ముందు నిలిపి ఉంచిన కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ఇండ్ల ముందు మోకాళ్ల లోతు వరదలు ప్రవహిస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఒకవైపు వరద ఉధృతంగా ప్రవహిస్తుంటే.. మరోవైపు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పట్టణ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.