డెహ్రాడూన్: వన్యప్రాణుల సంరక్షణ కోసమే ప్రభుత్వాలు అటవీ అధికారులను నియమిస్తాయి. కానీ ఉత్తరాఖండ్లో మాత్రం వన్యప్రాణులను సంరక్షించాల్సిన అటవీ అధికారులే ఓ ఎలుగుబంటిని కాల్చిచంపారు. అయితే వాళ్లు ఆ ఎలుగును ఉద్దేశపూర్వకంగా ఏమీ చంపలేదు. వారిపై దాడికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం షూట్ చేశారు. దాంతో అది అక్కడికక్కడే చనిపోయింది. చమోలీ జిల్లా జోషిమఠ్ ఏరియాలోని సింగ్ద్వార్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
సింగ్ద్వార్ పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నదని స్థానికులు మంగళవారం సాయంత్రం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆ ఎలుగుబంటిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. తీవ్రంగా గాలించి చివరికి ఆ ఎలుగుబంటి దాగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అనంతరం దాన్ని వలద్వారా బంధించే ప్రయత్నం చేయగా అది వారిపై దాడికి ప్రయత్నించింది. దాంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపగా అది మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి అటవీ అధికారులు సోషల్ మీడియాలో పోస్టుచేసిన వీడియోను మీరు కూడా వీక్షించవచ్చు.