ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కళ్యాణ్ ఏరియాలో ఓ వృద్ధుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఏకంగా రైలు కింద పడిపోయినా ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని కళ్యాణ్ ఏరియాలో ఓ వృద్ధుడు రైలు పట్టాలు దాటుతుండగా రైలు దూసుకొచ్చింది. వృద్ధుడు ఆ రైలును చూసినప్పటికీ చకాచకా పట్టాలు దాటే ఓపిక లేకపోవడంతో నిశ్చేష్ఠుడై నిలబడిపోయాడు.
ఇది గమనించిన రైలు పైలట్ రైలు తక్కువ వేగంతోనే ఉన్నందున వెంటనే సడెన్ బ్రేక్ వేశాడు. అప్పటికే వృద్ధుడు కంగారుతో రైలు పట్టాలపై పడిపోయాడు. రైలు మెల్లగా అతనిపైకి వచ్చి ఆగిపోయింది. దాంతో ఘటనను ప్రత్యక్షంగా చూస్తున్నవారు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వృద్ధుడిని రైలు కింద నుంచి బయటికి లాగి స్వల్పంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు.