ముంబై, మే 20: దవాఖానల్లో మెడికల్ ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఐఐటీ-బాంబే విద్యార్థులు, ప్రొఫెసర్లు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స తీసుకునే రోగులు బయటకు వదిలే (నిచ్ఛ్వాస) ఆక్సిజన్ను తిరిగి ఉపయోగించేవిధంగా మలిచే ‘బ్రీతింగ్ డివైజ్ ప్రోటోటైప్’ను అభివృద్ధి చేశారు. ‘రీబ్రీతర్’గా దీనికి పేరుపెట్టారు. ‘ఐసీయూలో చికిత్స తీసుకునే కరోనా రోగులకు నిమిషానికి 50 లీటర్ల ఆక్సిజన్ను సరఫరా చేస్తారు. ఇందులో వాళ్లు 1-1.5 లీటర్ల ఆక్సిజన్నే వినియోగిస్తారు. మిగతా 90 శాతానికి పైగా ఆక్సిజన్ వాతావరణంలో కలిసిపోతుంది. ‘రీబ్రీతర్’ పరికరంలోని క్లోజ్డ్ లూప్ సిస్టమ్ (లేదా సెమీ క్లోజ్డ్) సాయంతో వృథా అవుతున్న ఆక్సిజన్ను పునర్వినియోగిస్తాం’ అని ఐఐటీ-బాంబే కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ సంతోశ్ నోరోన్హా తెలిపారు. ఐసీయూల్లోని రోగుల నుంచి ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ విడుదల అవుతుండటమే దవాఖానల్లో అగ్ని ప్రమాదాలకు కారణమని, ఈ పరికరం వాటిని తగ్గించవచ్చన్నారు. దీని తయారీకి రూ.10 వేలు ఖర్చు అయినట్టు, త్వరలో దీనిపై ట్రయల్స్ జరుపనున్నట్టు వివరించారు