హైదరాబాద్: అసోంలో మరో పోలీస్ ఎన్కౌంటర్ జరిగింది. తాజాగా ధుబ్రి జిల్లాలో జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ బందిపోటు దొంగ హతమయ్యాడు. ఈ ఘటనతో కలిపి అసోంలో హిమాంత బిశ్వశర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పోలీస్ ఎన్కౌంటర్లో మృతిచెందిన నేరస్తుల సంఖ్య 25కు చేరింది. పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ నేరగాళ్ల సంఖ్య 39గా ఉన్నది. నేరస్తులను పట్టుకోవడం కోసం అసోం పోలీసులు శనివారం రాత్రి చాపర్-సల్కోచా మధ్య ప్రాంతంలో పలు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఆరుగురు నేరగాళ్లు పోలీసుల కంటబడ్డారు. పోలీసులను చూడగానే ఆ ఆరుగురు పరుగందుకున్నారు. దాంతో పోలీసులు వాళ్లను వెంబడిస్తూ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ బందిపోటు దొంగ హతమవగా మిగతా ఐదుగురు పారిపోయారు. అయితే పారిపోయిన దొంగల కోసం గాలింపు కొనసాగుతున్నదని ధుబ్రి ఎస్పీ అభిజిత్ గౌరవ్ తెలిపారు. కాగా, హిమాంత బిశ్వశర్మ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పోలీస్ ఎన్కౌంటర్లు పెరిగిపోయాయని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది.