16న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పైలెట్ ప్రాజెక్టుకు అంకురార్పణ
దశాబ్దాల సామాజిక వివక్షను పారదోలేలా..
తరతరాల అణచివేత నుంచి విముక్తి కల్పించేలా..
చీకట్లో మగ్గిన జీవితాలకు కొత్త వెలుగునిచ్చేలా..
తల రాతలు మార్చేలా..
ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించేలా..
దళితజాతి దశాదిశ మార్చేలా..
యావత్ దేశానికే దిక్సూచిలా..
నవశకమై రాబోతున్నది దళితబంధు పథకం. దళితబాంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సోమవారం అంకురార్పణ కాబోతున్నది.
కరీంనగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వినూత్న ఆలోచనలు, విప్లవాత్మక పథకాలతో దేశానికి దిక్సూచిలా నిలుస్తు న్న తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నది. దశాబ్దాలపాటు దగాపడ్డ దళితజాతి దశాదిశ మార్చే లక్ష్యంతో ఓ చారిత్రక పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. పంట పెట్టుబడితో రైతులను తలెత్తుకునేలా చేసిన రైతుబంధుకు వేదికైన ఉద్యమాల హుజూరాబాద్ గడ్డపై దళితబంధుకు అంకురార్పణ చేయబోతున్నది. ఆర్థిక, సామాజిక భద్రత కల్పించి దళితులు ఆత్మగౌరవంతో బతికేలా చేయాలన్న ఉదేశ్యంతో ఈ పథకాన్ని ఆవిష్కరిస్తుండగా, యావత్ దళిత సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నది.
విప్లవ చైతన్యానికి, ఉద్యమాలకు హజూరాబాద్ వేదిక. ఎన్నో పోరాటాలకు పుట్టినిల్లు. సమానత్వం కోసం, రైతు విముక్తి కోసం పోరు సల్పిన గడ్డ. ఈ పోరాటాల ఫలితంగా ఈ గడ్డపై ఎంతో మంది అమరులయ్యారు. దళిత జాతి ఉద్ధరణకు, వారి కి సమాజంలో సముచితమైన గౌవరం కోసం ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలే చేశారు. వారంతా దేని కోసమైతే పోరాడారో ఏవైతే కలలు గన్నారో.. వాటిని సాకారం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారు. యావత్ దళిత జాతి దిశను మార్చాలన్న ఉద్దేశ్యంతో ఇదే గడ్డ వేదికగా సోమవారం మహోన్నత పథకానికి అంకురార్పణ చేయబోతున్నారు.
దేశచరిత్రలోనే చరిత్రాత్మకం..
ఇన్నాళ్లూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్న తేడాలేకుండా ప్రతి పార్టీ దళిత సంక్షేమం గురించి ఆలోచించలేదు. గరీబీ హఠావో అన్న కాంగ్రెస్ నుంచి నేటి బీజేపీ వరకు సదరు ఈ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి తప్ప ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ తరుణంలో దళిత బిడ్డలకు ఆర్థిక స్వావలంబన కల్పించి, వారిని ఆత్మగౌరంతో బతికేలా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తలపించారు. ఎవరూ ఊహించని విధంగా దళిత బంధు పథకాన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నారు. ఇది యావత్ దేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మక పథకంగా నిలిచిపోనున్నది. సమాజంలో వెనుకబడిన దళితలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లనున్నది.
విప్లవాల గడ్డపై వినూత్న పథకాలు..
ఎన్నో విప్లవాలకు వేదికైన హుజూరాబాద్ గడ్డపై నుంచి సీఎం కేసీఆర్ మరో చారిత్రక పథకానికి సోమవారం శ్రీకారం చుట్టబోతున్నారు. నిజానికి దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన రైతు బంధు పథకాన్ని ఇదే హుజూరాబాద్ నియోజక వర్గం శాలపల్లి- ఇందిరానగర్ వద్ద 2018 మే 10న ప్రారంభించారు. ఈ పథకం మూడేళ్లుగా రైతులోకానికి అండగా నిలువడమే కాదు, ప్రతి రైతూ గర్వంగా తలెత్తుకునేలా చేసింది. దేశంలోని మెజార్టీ రాష్ర్టాలు రైతుబంధును అధ్యయనం చేయడమే కాదు, అమలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాయి.
రైతు దేశానికి వెన్నెముక అంటూ 74 ఏండ్ల స్వాతంత్య్ర చరిత్రలో అన్ని పార్టీలు చెప్పడం విన్నామే గానీ, ఆ రైతును అన్ని విధాలా ఆదుకున్న ఘనత మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. అందుకే కర్షకలోకం కేసీఆర్ వెంట నడుస్తున్నది. హుజురాబాద్ వేదికగా ప్రారంభించిన రైతుబంధు పథకం గ్రాండ్ సక్సెస్ అవ్వడమే కాదు, దేశానికి ఒక దిక్సూచిగా మారింది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అంకురార్పణకు కూడా ముఖ్యమంత్రి ఇదే వేదికను ఎంచుకున్నారు. ప్రభుత్వ సంకల్పం.. ఇక్కడి గడ్డకు ఉన్న బలం రెండు తోడైతే.. దళితబంధు పథకం కూడా రైతు బంధు మాదిరిగా పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందని నమ్ముతున్నారు.
ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి..
ఉద్యమాల గడ్డ వేదికగా సోమవారం మరో విప్లవాత్మక పథకం ఆరంభమవుతున్నది. దీనిపై యావత్ దేశం దృష్టిపెట్టింది. ఈ పథకం అమలు ఎలా ఉంటుంది? తద్వారా దళిత జాతి బతుకుల్లో మార్పులేంటి? ఆర్థిక స్వావలంబన ఎలా ఉంటుంది? ఇంతటి ప్రతిష్టాత్మక పథకాన్ని ప్ర భుత్వం ఎలా అమలు చేస్తుంది? అనే అంశాలపై జోరుగా చర్చ సాగుతున్నది. ఎందుకంటే దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దళితులు ఉండగా, మన వద్ద అమలు చేసే దళిత బంధు పథకం దేశానికే దిక్సూచిగా మారే అవకాశమున్నది. అందుకే ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తికనిపిస్తున్నది.
20వేలకు పైగా కుటుంబాలకు లబ్ధి..
అనేక సామాజిక, ఉద్యమ, ప్రజాచైతన్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దళితబంధు అమలుకు సర్కారు హుజురాబాద్ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. ఈ నియోజకవర్గంలో 20,929 కుటుంబాలుండగా, అందులో 66వేల పైచిలుకు జనాభా ఉన్నది. అందులో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకం వర్తింప చేసేందుకు అడుగులు పడుతున్నాయి. సోమవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తారు. ఆ తర్వాత.. అతి త్వరలోనే అర్హత ఉన్న మొత్తం కుటుంబాలను ఎంపిక చేయనున్నారు. అందులోనూ ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని ఇప్పటికే మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
అలాగే గ్రామసభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేసి.. సదరు జాబితాను రెండు రోజులపాటు పంచాయతీ పరిధిలో డిస్ప్లే చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా వెల్లడించారు. అంతేకాదు జాబితాలో ఎవరిపేరైనా మిస్ అయితే.. తిరిగి అక్కడికక్కడే దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ లెక్కన అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ దళిత బంధు కింద లబ్ధి చేకూరనున్నది. ఇందుకోసం ఇప్పటికే 500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, మిగిలిన నిధులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది.