సినిమాలు వేరు. రాజకీయ జీవితం వేరు. తెరపై కదలాడే బొమ్మల సాయంతో రెండున్నర గంటల్లో ఒక జీవితాన్ని ఆవిష్కరించవచ్చు. అయితే, నిజ జీవితం దీనికి ఎంతో భిన్నం. విశ్వనటుడిగా ప్రఖ్యాతి సాధించి ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలను పోషించిన నటుడు కమల్హాసన్ రాజకీయ ఓనమాలను దిద్దడంలో తడబడుతున్నారా? ఇటీవలే మూడేండ్లు పూర్తిచేసుకున్న మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ భవిష్యత్ మూణ్నాళ్ల ముచ్చట కానుందా? తాజా పరిణామాలు, ఆ పార్టీలో రేగుతున్న అసమ్మతి కమల్ రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
రాజకీయ క్షేత్రంలో కమల్ తప్పటడుగులుపార్టీలో తీవ్ర అసంతృప్తి, వీడుతున్న కీలక నేతలు
అధ్యక్షుడి వైఖరిని తప్పుబడుతూ ముప్పేటదాడి ఓటర్లు, నేతల నాడిని పసిగట్టడంలో తడబడ్డ విశ్వనటుడు
చెన్నై, మే 28: తమిళనాట మార్పు తీసుకొస్తానంటూ 2018లో కమల్ ఎంఎన్ఎం స్థాపించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 3.7 శాతం ఓట్ల శాతాన్ని సాధించిన ఆ పార్టీ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2.5 శాతం ఓట్లకు పరిమితమైంది. మిత్రపక్షాలతో కలిపి ఎన్నికల బరిలోకి దిగిన ఎంఎన్ఎం.. 135 స్థానాల్లో పోటీచేసి అన్నింటా ఓటమిపాలైంది. దక్షిణ కోయంబత్తూర్ నుంచి పోటీచేసిన పార్టీ అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి కమల్హాసన్కి సైతం పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో, ఎంఎన్ఎంను పలువురు ముఖ్య నేతలు వరుసగా వీడుతున్నారు. పార్టీ దారుణ వైఫల్యానికి ప్రధాన కారణం కమల్ వ్యవహార శైలేనని వారు బాహాటంగానే చెబుతుండటం గమనార్హం.
ఎంఎన్ఎంను ఇటీవల వీడిన ఉపాధ్యక్షుడు ఆర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. పార్టీ నేతల కంటే కమల్కు ఎన్నికల కన్సల్టెంట్ సంస్థలపైనే ఎక్కువ నమ్మకమున్నదని ఆరోపించారు. పార్టీలో ప్రజాస్వామ్యంలేదని పేర్కొన్నారు. అంతా తానేనని భావించే కమల్.. ఒక్కరి వల్లే రాజకీయ పార్టీలు నిలబడలేవని గుర్తించాలన్నారు. పార్టీని వీడేముందు ఎంఎన్ఎంకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సంతోష్బాబు, పార్టీని వీడిన ముఖ్య నేతలు సీకే కుమురవేల్, ఎం మురుగానందం, పద్మప్రియ సైతం కమల్వి ఒంటెద్దు పోకడలంటూ విమర్శించారు. ‘ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే, దానికి కారణం నేతలేనంటూ కాంగ్రెస్ అధిష్ఠానం చేతులు దులుపుకుంటుంది. సరిగ్గా, ఎంఎన్ఎంలో కూడా ఇదే జరుగుతుంది. అంతా తానై పార్టీని నడుపుతున్నానని చెప్పిన కమల్.. ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే, నేతలే దీనికి కారణమంటూ పేర్కొనడం, తన తప్పులను దాచిపెట్టుకోవడం సరైంది కాదు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు ఎంఎన్ఎం నేతలు తెలిపారు. ద్రవిడ పార్టీలను వ్యతిరేకిస్తూ.. రాజకీయాల్లో మార్పు తీసుకువస్తానని ప్రకటించిన
కమల్.. ఆ పార్టీల మేనిఫెస్టోనే అనుసరించారని, నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని.. భావజాలం, ప్రజల సమస్యలను గుర్తించడంలో ఆయన వెనుకబడ్డారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేజ్రీవాల్ను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్న కమల్.. ఆయనను అనుసరించడంలో విఫలమయ్యారని, రీల్ లైఫ్కు, రియల్ లైఫ్కు మధ్య గల గీతను గుర్తించట్లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతే పెద్ద సమస్యగా పేర్కొంటూ ఎన్నికల్లోకి వెళ్లడం, బిగ్బాస్ వంటి కార్యక్రమాలు తనకు ఓట్లు కురిపిస్తాయని భ్రమ పడటం కమల్ కొంప ముంచిందంటున్నారు. ముఖ్యంగా పార్టీ కేడర్ను కింది స్థాయి నుంచి బలోపేతం చేయడంలో కమల్ ఘోరంగా విఫలమయ్యారని అభిప్రాయపడుతున్నారు. కాగా తాను బతికిఉన్నంత వరకూ రాజకీయాల్లో ఉంటానని, రాజకీయాలు ఉన్నంత వరకూ తన పార్టీ ఉంటుందని ఇటీవల కమల్ ప్రకటించారు.