న్యూఢిల్లీ: అసోం రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు అసోంలో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ జరుగుతున్నది. నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా రాష్ట్ర యువతను కోరుతున్నా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి. అసోం ప్రగతి కోసం, అసోం ప్రజల బంగారు భవిత కోసం ఓటేయండి అని ఆమె తన ఫేస్బుక్ ఖతాలో పోస్ట్ చేశారు.
అసోం అసెంబ్లీ తొలి విడుత ఎన్నికల్లో భాగంగా ఇవాళ మొత్తం 47 స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. ఈ 47 స్థానాల్లో 42 స్థానాలు ఉత్తర అసోంలోని 11 జిల్లాల పరిధిలో ఉన్నాయి. మరో ఐదు స్థానాలు మధ్య అసోంలోని నగావ్ జిల్లాలో ఉన్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు అసోంలో పోలింగ్ కొనసాగనున్నది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిలబడి ఉన్న అందరికీ ఓటేసే అవకాశం కల్పించనున్నారు.