మణికొండ, మే 25 : కరోనా ఆపత్కాలంలో ‘మనం సైతం’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మణికొండ చిత్రపురి కాలనీలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. ప్రముఖ సినీ ఆర్టిస్టు కాదంబరి కిరణ్ ప్రారంభించిన ‘మనం సైతం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు పదిరోజులుగా భోజనాలు, పల్స్ ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచి సేవలు అందజేస్తున్నామని కిరణ్ తెలిపారు. ఇందుకు చిత్రపురికాలనీ వాసులు నిమ్మగడ్డ అనిత, అంజలి, పద్మావతి దేవి, టెక్నీషియన్ సురేశ్ ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.