ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 17 : గతంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిచ్చేది.. ముక్కు పుటలదిరేలా దుర్వాసనతో మురుగు కాలువలు దర్శనమిచ్చేవి. పరిసరాలన్నీ అపరిశుభ్ర వాతావరణంలో ఉండేవి. ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోయి గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పల్లె అభివృద్ధితో పాటు పరిశుభ్రతతో బాగుండాలన్న సంకల్పంతో ప్రతి గ్రామానికి సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. పంచాయతీకొక ప్రత్యేక ట్రాక్టర్ను కేటాయించి ట్రాక్టర్ ద్వారా ప్రతిరోజు గ్రామంలో చెత్తసేకరణ చేసి కంపోస్టుయార్డుకు తరలించి కంపోస్టు ఎరువు తయారు చేయిస్తున్నారు. ఈ ఎరువు పంటలకు ఎంతో లాభం చేకూరుస్తున్నందున కంపోస్టు ఎరువును విక్రయించగా గ్రామపంచాయతీలకు ప్రత్యేక ఆదాయం సమకూర్చుకుంటున్నారు.
ఇంటింటికీ చెత్తసేకరణ..
ప్రభుత్వం ముందుగా ఇంటింటికీ చెత్తసేకరణకు గానూ జనాభా ప్రాతిపదికన మల్టీ పర్పస్ వర్కర్లను నియమించింది. చెత్త తరలించేందుకు ట్రాక్టర్ల కొనుగోలుకు ఆదేశించింది. తడి, పొడి చెత్తను వేరు చేసేలా ఇంటింటికీ రెండేసి చెత్తబుట్టలను సర్పంచులు అందజేశారు. సేకరించిన చెత్తను కంపోస్టుయార్డులకు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేస్తూ రైతులకు విక్రయిస్తున్నారు.
ఎరువు తయారీ..
కుల్లిన, పాడైన కూరగాయలు, బీడీ, ఆకు, తుక్కులాంటివి నాడెపు కంపోస్టు తయారుచేసే అరలో వేస్తారు. అంతకుముందు కింద కొబ్బరిపీచు వేసి పశువుల పేడ 20కిలోలు వేస్తారు. చెత్తను పొరలు, పొరలుగా వేస్తూ నీళ్లు చల్లుతారు. అరను నింపిన తర్వాత అందులో వానపాములను వేస్తారు. ఆ తర్వాత పైనుంచి గన్నీ సంచులతో మూసివేస్తారు. ప్రతిరోజు పైనుంచి నీల్లు చల్లుతుంటారు. ఇలా 45రోజుల నుంచి రెండు నెలల వరకు సేంద్రియ ఎరువు తయారవుతుంది.
కంపోస్టు ఎరువు ఒక్క కేజీ రూ.150
కంపోస్టు షెడ్డులో తయారైన ఎరువును గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో రైతులకు విక్రయిస్తున్నారు. కిలో రూ.150 చొప్పున అమ్ముతూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. వానకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి జీపీలోనూ రైతులు ఈ సేంద్రియ ఎరువు కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. దీంతో ఈ ఎరువుకు డిమాండ్ ఏర్పడింది. కొన్ని జీపీలు రైతులకు విక్రయించగా మిగిలిన ఎరువును నర్సరీల్లోని మొక్కలకు ఏస్తున్నారు.