నిరుపేదలు, గూడు లేనివారు, ఇరుకిరుకు ఇండ్లల్లో నివాసముంటూపడరాని పాట్లు పడిన వారు ఇప్పుడు దర్జాగా ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లల్లో సుఖపడుతున్నారు. అందాల మేడలు, అందులో లిఫ్ట్, గార్డెనింగ్, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యం కల్పించడంతో ఖుష్ అవుతున్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో గ్రేటర్ వ్యాప్తంగా 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష ‘డబుల్’ ఇండ్ల లక్ష్యం నెరవేరబోతోంది. రూ.9714 కోట్లతో నిర్మించబోయే లక్ష ఇండ్లలో ఇప్పటికే 79,582 ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, 12 ప్రాంతాల్లో లబ్ధిదారులకు అందజేశారు. తాజాగా ఈ నెలాఖరు నుంచి నాలుగుచోట్ల పూర్తయిన 754 గృహాలను అప్పగించనున్నారు. ఈనెల 26 నుంచి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇండ్ల ప్రారంభోత్సవం చేయనుండగా, సాగర తీరంలో నిర్మించిన 400 డబుల్ ఇండ్ల సముదాయం చూడచక్కగా ఉందని శుక్రవారం ట్విట్టర్లో వెల్లడించారు.
పేదలు గొప్పగా జీవించాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం. ఎంతో ఖర్చు చేసి ఆధునిక శైలిలో సకల వసతులతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. ఇచ్చిన ఇండ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. విక్రయించినా, కిరాయికిచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. నగరంలో నాలుగుచోట్ల పూర్తయిన ఇండ్ల సముదాయాలను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. పైసా భారం పడకుండా ఇండ్లు నిర్మించి ఇస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. -మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్