ధర్మసాగర్, మే 11 : మండలంలోని మల్లక్పల్లె, ధర్మపురం, పెద్దపెండ్యాల, ధర్మసాగర్, జానకీపురం తదితర గ్రామాల్లో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు మంగళవారం శానిటైజేషన్ పనులు నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇళ్లలో జీపీ సిబ్బందితో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. అలాగే పారిశుధ్య పనులు చేపట్టారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 6 నుండి 10 గంటల వరకు మాత్రమే షాపులు తెరచి ఉంచాలని సర్పంచ్లు కోరారు.
11వ డివిజన్లో..
మట్టెవాడ : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా నగరంలోని 11వ డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మీ సురేందర్ ఆదేశాల మేరకు కాపువాడ, రంగంపేట, శ్రీనివాసకాలనీ, కాకతీయ కాలనీల్లో మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ హ్యాండ్ పంపులతో ద్రావణం పిచికారీ చేశారు.
22వ డివిజన్లో..
పోచమ్మమైదాన్ : గ్రేటర్ 22వ డివిజన్లో శానిటైజేషన్ ప్రక్రియ కొనసాగించారు. కార్పొరేటర్ బస్వరాజు చిన్న కుమారస్వామి ఆధ్వర్యంలో అనేక వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లించారు.
హసన్పర్తిలో..
హసన్పర్తి : గ్రేటర్ వరంగల్ 66 డివిజన్ హసన్పర్తిలో పలు వార్డులో కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు లాక్ డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.
మల్లికుదుర్లలో..
వేలేరు : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి గ్రామంలో పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని సర్పంచ్ గోదల రాజిరెడ్డి అన్నారు. మండలంలోని మల్లికుదుర్ల గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోవింద సురేశ్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.