కొనసాగుతున్న టాస్క్ఫోర్స్ బృందాల దాడులు
రెమ్డెసివిర్, ఆక్సిజన్ వినియోగంపై తనిఖీలు
మందుల నిల్వల పరిశీలన, చార్జీలపైనా ఆరా
రోగుల కుటుంబాల నుంచి వివరాల సేకరణ
ఖలీల్వాడి, మే 1: ప్రైవేట్ దవాఖానల్లో టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. ఇందు లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ దవాఖానల్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ వినియోగంపై కలెక్టర్ నియమించిన టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీలక్ష్మి, శ్రీవిష్ణు, తిరుమల, శ్రీసాయి, సాయి అశ్విన్, జయ, మనోరమ, వేదాన్ష్, శ్రీ వెంకటేశ్వర, సూర్య, ప్రతిభ, కిడ్స్ కేర్ తదితర దవాఖానల్లో తనిఖీలు నిర్వహించి ఇంజక్షన్లు, ఆక్సిజన్ పేషెంట్లకు ఇచ్చిన మందుల వివరాలు, సరఫరా, వాడకం, నిలువ తదితర అంశాలను రికార్డుల ద్వారా పరిశీలించారు. రోగుల కుటుంబ సభ్యులకు కాల్ చేసి ఇంజక్షన్లు ఎన్ని ఉపయోగించారు.. వాటికి ఎంత బిల్లు తీసుకున్నారని వివరాలు సేకరించారు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువగా వసూలు చేశారా అని అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో డీఎస్సీడీవో శశికళ, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బాబురావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, డ్రగ్స్ శాఖ ఏడీ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. తనిఖీల నేపథ్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేస్తూ పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.