లండన్: ఒక మందలోని గొర్రెలు ఒక క్షేత్రంలో వృత్తాకారాల్లో నిల్చున్నాయి. దూరం నుంచి చూసిన ఒక వ్యక్తి దీనిని స్పేస్షిప్గా భావించారు. బ్రిటన్లోని ఈస్ట్ ససెక్స్ క్షేత్రంలో తీసిన ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. 47 ఏండ్ల క్రిస్టోఫర్ హాగ్ రోజువారీ లాగే రోటింగ్డీన్లో సైకిల్పై వెళ్తున్నాడు. కొండపైనున్న ఆయన ఒక మైలు దూరం నుంచి చూడగా ఒక క్షేత్రంలో గుండ్రటి ఆకారం ఒకటి కనిపించింది. ఆశ్చర్యపోయిన అతడు అది స్పేస్షిప్ అయ్యి ఉంటుందని భ్రమపడ్డాడు.
సైకిల్పై మరింత ముందుకు వెళ్లి చూడగా మందలోని గొర్రెలు సర్కిల్స్లో రౌండ్గా నిలబడి ఉండటం హాగ్కు కనిపించింది. ఆశ్చర్యపోయిన అతడు ఫొటోలు తీసి తన ఫేస్బుక్లో షేర్ చేశాడు. తాను ఎప్పుడూ ఆ గొర్రెల మంద సమీపంగా సైకిల్పై వెళ్తుంటానని, అవి అరుస్తూ ఉండేవని తెలిపాడు. అయితే ఆ రోజు మాత్రం గొర్రెలన్నీ వృత్తాకార వలయాల్లో నిల్చోవడంతోపాటు చాలా సైలెంట్గా ఉన్నాయని పేర్కొన్నాడు.
ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అరుదైన ఈ ఫొటోపై నెటిజన్లు భిన్నంగా కామెంట్ చేశారు. ఏదో శక్తి ఆ గొర్రెలను రౌండ్లలో నిల్చోవాలని ఆదేశించినట్లుగా ఉన్నదని ఒకరు వ్యాఖ్యానించారు. కాపరిని భయపెట్టేందుకు అవి అలా నిల్చున్నాయని మరొకరు చమత్కరించారు. ఏదీ ఏమైనా మందలోని గొర్రెలన్నీ ఇలా వృత్తాకార వలయాల్లో నిల్చొని ఉండటం చాలా విచిత్రమని పలువురు పేర్కొన్నారు.