హైదరాబాద్ : గ్రామీణ విద్యార్థులకు ఉపాధి కల్పన కోసం స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సూచించారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా లేబర్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల పద్దులపై ఎమ్మెల్యే పెద్ది మాట్లాడారు. కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ భవన నిర్మాణ రంగంతో పాటు వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్న లక్షలాది మంది కార్మికులను వారి స్వస్థలాలకు పంపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ర్టం వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అందులో భాగంగా ఇప్పటికే లక్షా 34 వేల ఉద్యోగాలు ఇచ్చుకున్నాం.
టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ చదివిన విద్యార్థులకు స్కిల్స్పై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అయితే చాలా మంది గ్రామీణ విద్యార్థులకు నైపుణ్యం లేకుండా పోతోంది. వీరి కోసం మండలం యూనిట్గా తీసుకుని నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు 16,492 మంది జర్నలిస్టులకు, 20 వేల మంది హోంగార్డ్స్కు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామని తెలిపారు.
భవన నిర్మాణ కార్మికులు లేకుండా నిర్మాణ రంగాన్ని ఊహించలేము. కాబట్టి రాష్ర్టానికి సంబంధించిన వారితోపాటు రాష్ర్టేతరులకు కార్మిక చట్టం ప్రకారం వారి హక్కులను కాపాడాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు లేబర్ డిపార్ట్మెంట్ అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. లేబర్ కార్డు ఉన్న కుటుంబాల్లో ఇద్దరు ఆడపిల్లలు పుడితే కల్యాణలక్ష్మికి అదనంగా రూ. 10 వేలు ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక మహిళా కూలీలు కాన్పు అయితే రూ. 20 వేలు ఇవ్వడం గొప్ప విషయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.