కాల్వలో చిక్కుకున్న భారీ నౌకను కదిలించేందుకు ముమ్మర యత్నాలు
ఒడ్డును తవ్వి నౌకను తేలేటట్టు చేసేందుకు కృషి
ఓడలోని కంటైనర్లు దించేందుకూ యోచన
ఇరువైపులా భారీగా నిలిచిపోయిన నౌకలు
సూయజ్, మార్చి 27: అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఈజిప్ట్లోని సూయజ్ కాల్వలో చిక్కుకుపోయిన భారీ నౌకను కదిలించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. భారీ టగ్బోట్లు, డ్రెడ్జింగ్ (తవ్వకం), ఆటుపోట్ల ఆధారంగా నౌకకు త్వరలోనే విముక్తి కల్పించనున్నట్టు నౌకను పునరుద్ధరించేందుకు ప్రత్యేకంగా నియమించుకున్న బోస్కలిస్ సంస్థ సీఈవో పీటర్ బెర్డోవ్స్కీ తెలిపారు. అది సాధ్యం కాకపోతే నౌకలోని వందలాది కంటైనర్లను కిందకు దించుతామని, ఇందుకోసం ఇప్పటికే ఓ భారీ క్రేన్ను రప్పిస్తున్నట్టు చెప్పారు. భారీ కంటైనర్ నౌక అయిన ఎవర్ గివెన్ గత మంగళవారం సూయజ్ కాల్వలో అడ్డంగా చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. నౌక చిక్కుకున్న ప్రాంతానికి మీడియాను అనుమతించడం లేదు. ఈ నౌక జపాన్కు చెందిన షూయీ కిసెన్ సంస్థకు చెందినది.
ఒడ్డును తవ్వి..
షూయీ కినెన్ అధ్యక్షుడు యుకిటో హిగకి మీడియాతో మాట్లాడుతూ.. కాల్వ ఒడ్డును తవ్వి, ఇసుకను తొలగించి నౌకను తిరిగి నీటిపై తేలేటట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఇది విఫలమైతే, నౌకలోని కంటైనర్లను దించే అంశాన్ని పరిశీలిస్తామని, అయితే అది చాలా క్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. కాల్వ మార్గాన్ని తిరిగి తెరిచేందుకు ఈజిప్టుకు తాము సహకరిస్తామని అమెరికా ముందుకొచ్చింది.
భారీగా ట్రాఫిక్ జామ్..
సూయజ్ కాల్వలో నౌక అడ్డంగా చిక్కుకుపోవడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం నాటికి దాదాపు 280 నౌకలు నిలిచిపోయినట్టు అంచనా. కొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్తుండగా, మరికొన్ని నౌకలు ఇదే మార్గంవైపు వస్తున్నాయి. నౌకను కదిలించేందుకు ఇంకెన్ని రోజులు పడుతుందో స్పష్టత లేదు. దీంతో అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్రనష్టం వాటిల్లుతున్నది.