న్యూఢిల్లీ: పిల్లల గొంతునులిమి ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకున్నది. ఆమె మరణించగా, పిల్లలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. సుశీల్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతడు తన గ్రామం నుంచి గురువారం సాయంత్రం తిరిగి వచ్చాడు. ఇంటికి వెళ్లగా డోర్ లాక్ చేసి ఉన్నది. తలుపును ఎంత కొట్టినా భార్య తలుపు తీయలేదు. దీంతో బయటకు వెళ్లి మద్యం సేవించాడు.
మరోవైపు స్థానికుల ఫిర్యాదుతో రాత్రి 8 గంటలకు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. సుశీల్ అనుమతితో తలుపులు బద్ధలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా అతడి భార్య సీలింగ్కు వేలాడుతూ చనిపోయి కనిపించింది. కాగా బాత్రూమ్లో ఇద్దరు మగ పిల్లలు పడి ఉన్నారు. మెడ చుట్టూ గుడ్డతో నులిమినట్లు ఉన్నది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పిల్లలకు ప్రమాదం ఏమీ లేదని, వారు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.