క్యోటో: జపాన్లో చెర్రీ పుష్పాలు ఈ ఏడాది విరగబూసాయి. మార్చి సీజన్లోనే సకురా పుష్పాలు .. పర్యాటకులను అలరిస్తున్నాయి. జపాన్లో ఇప్పుడు వసంత రుతువు. అయితే ఆ సమయంలో అక్కడ సకురా పుష్పాలు ఎక్కువగా పూస్తుంటాయి. మార్చి, ఏప్రిల్లో అక్కడ ఉన్న తోటలన్నీ ఆ పువ్వులతో అందంగా మారుతుంటాయి. జపాన్ చరిత్రలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో సకురా పుష్పాలు పూశాయి. అంతేకాదు వసంతం ముందే వచ్చిందని కూడా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. సుమారు 1200 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిణామం చోటుచేసుకున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
2021 స్ప్రింగ్ సీజన్ జపాన్లో అప్పుడే ప్రారంభమైంది. మార్చి 26వ తేదీన క్యోటోలో అత్యధిక స్థాయిలో సకురా పుష్పాలు విరగబూసినట్లు ఒసాకా వర్సిటీ పరిశోధకులే తేల్చారు. వారి దగ్గర ఉన్న డేటా ఆధారంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు. నిజానికి వాతావరణ మార్పుల వల్ల పుష్పాలు తొందరగా ముందే పూస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే జపాన్ చెర్రీ పుష్పాలు అయిన సకురాల గురించి ఆ దేశం 812 AD నుంచి డేటాను మెయిన్టేన్ చేస్తున్నది.
జపాన్ రికార్డుల ప్రకారం 1409వ సంవత్సరంలోనూ వసంతం కాస్త ముందే వచ్చింది. ఆ ఏడాది మార్చి 27వ తేదీన భారీ స్థాయిలో జెర్రీ పుష్పాలు విరగబూసినట్లు స్థానిక రికార్డులు చెబుతున్నాయి. జపాన్ చెర్రీ పుష్పాలను సకురా అంటారు. సకురా సీజన్లో ఈ పుష్పాలు ఎక్కువగా పూస్తుంటాయి. జపాన్ సాంప్రదాయంలో ఇది ముఖ్య సందర్భం కూడా. ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా జపనీయులు ఈ సీజన్ను ముఖ్యమైందిగా భావిస్తారు. స్నేహితులు కలుసుకుంటారు. ఫ్యామిలీలు కూడా భేటీ అవుతాయి.వారంతా సకురా సంబరాలను జరుపుకుంటారు.
ఒసాకా వర్సిటీకి చెందిన ఓ పరిశోధకుడు .. సకురా సీజన్ గురించి ఆరా తీశారు. రాజులు, చక్రవర్తులు, చరిత్రకారులు తమ డైయిరీల్లో రాసుకున్న అంశాలను పరిశీలించినట్లు చెప్పారు. దాని ప్రకారం 812వ సంవత్సరం వరకు డేటాను పరిశీలించినట్లు వెల్లడించారు. గత 1200 ఏళ్లలో రుతువులు ఎలా మారాయో స్టడీ చేసినట్లు చెప్పారు. అయితే 1800వ సంవత్సరం నుంచి క్యోటో నగరంలో.. సకురా పుష్పాలు విరగబూసే రోజు ముందుకు జరుగుతున్నట్లు గమించినట్లు చెప్పారు. మిడ్ ఏప్రిల్ నుంచి ఆ నెల ఆరంభం వరకు మారినట్లు గుర్తించానన్నారు. చెర్రీ పువ్వుల సీజన్ ఈ ఏడాది మార్చి 11వ తేదీన హిరోషిమాలో ప్రారంభమైంది. గత రికార్డులతో పోలిస్తే ఇది 8 రోజులు ముందే వచ్చింది.