అహ్మదాబాద్: బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవివి రాజీనామా సమర్పించారు. అనంతరం బీజేపీ గుజరాత్ వ్యవహారాల ఇన్చార్జి భూపేంద్ర యాదవ్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ ఆచార్య దేవవ్రత్ను కలిశారు. ఈ రెండు పరిణామాలు చకచకా జరిగిపోయాయి. నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వడం కోసమే తాను సీఎం పదవి నుంచి తప్పుకున్నానని విజయ్ రూపానీ చెబుతున్నా, అసలు కారణం మాత్రం వేరేలా ఉన్నదని తెలుస్తున్నది.
వచ్చే ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. పటేల్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి అతని నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నూతన సీఎం రేసులో మొత్తం నలుగురు నేతలు ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతున్నది. మన్సుక్ మాండవీయ, నితిన్ పటేల్, సీఆర్ పాటిల్, పురుషోత్తమ్ రూపాలా కొత్త సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తున్నది. మరి ఈ నలుగురిలో ఎవరిని అదృష్టం వరించనుందో తెలియాలంటే.. బీజేపీ అధిష్ఠానం తుది నిర్ణయం చేసే వరకు వేచిచూడాల్సిందే.
కాగా, సీఎం రేసులో ఉన్న నలుగురిలో మన్సుక్ మాండవీయ ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖతోపాటు రసాయనాలు ఎరువుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. నితిన్ పటేల్ 2016 నుంచి గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారు. ఇక సీఆర్ పాటిల్ లోక్సభ్యుడిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన 6,89,668 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. ఇక పురుషోత్తమ్ రూపాలా కూడా మోదీ ప్రభుత్వంలో మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ నలుగురిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.