ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం మితి నదిలో లభించిన కారు నంబర్ ప్లేట్ తనదేనని విజయ్ నాడే అనే వ్యక్తి సోమవారం తెలిపారు. ఎంమ్హెచ్ 20 1539 అనే నంబర్ ప్లేట్ ఉన్న తన కారును గత ఏడాది నవంబర్ 16న దొంగిలించారని చెప్పారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని, ఫిర్యాదు కాపీ తన వద్ద ఉన్నదని ఆయన తెలిపారు. తన కారు చోరీ ఫిర్యాదుపై మూడు నెలలుగా తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అయితే అలాంటి రెండు నంబర్ ప్లేట్లను మితి నది నుంచి ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం తనకు సమాచారం ఇచ్చారని విజయ్ నాడే వెల్లడించారు.
కాగా, అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో ఉన్న కారుకు సంబంధించిన హీరేన్ మన్సుఖ్ హత్య కేసులో ఎన్ఐఏకు కీలక ఆధారాలు లభించాయి. కేసులో నిందితుడైన రియాజుద్దీన్ ఇచ్చిన సమాచారంతో మితి నదిలో ఆదివారం గజ ఈతగాళ్లతో గాలించగా డిజిటల్ వీడియో రికార్డర్, సీపీయూలు, ల్యాప్టాప్, రెండు నంబర్ ప్లేట్లు లభించాయి. ఎన్ఐఏ వీటిని స్వాధీనం చేసుకొన్నది.
ఈ రెండు కేసుల్లో ఆరోపణలపై సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే కూడా ఈ సందర్భంగా మితి నది వద్ద ఉన్నారు. నదిలో లభించిన డిజిటల్ వీడియో రికార్డర్, వాజే నివాసం ఉన్న హౌసింగ్ సొసైటీది కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. హీరేన్ మృతి కేసులో ఎన్ఐఏ అధికారులు కాజీని విచారించగా, వాజే ఆదేశాలతో ఆధారాలను మితి నదిలో పడేసినట్టు చెప్పాడు.