బెంగళూరు : కర్ణాటకకు చెందిన ఓ డాక్టర్పై దాడి కేసులో నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు చిక్కమగళూరు ఎస్పీ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే డెంగీతో బాధపడుతున్న ఆరేండ్ల వయసున్న భువన్ అనే బాలుడిని చికిత్స నిమిత్తం చిక్కమగళూరు జిల్లాలోని తారికేరి పట్టణ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతికి డాక్టర్ దీపక్(50) కారణమని మృతుడి బంధువులు ఆరోపించారు.
ఈ క్రమంలో సోమవారం లంచ్ కోసం నడుచుకుంటూ వెళ్తున్న డాక్టర్ దీపక్పై మృతుడి బంధువుతో పాటు మరో ముగ్గురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డాక్టర్ను చికిత్స నిమిత్తం శివమొగ్గ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో డాక్టర్పై దాడి చేసిన నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్లపై దాడులు జరగకుండా ఉండేందుకు లీగల్ సెల్ను ఏర్పాటు చేయాలని కర్ణాటక రెసిడెంట్ డాక్టర్లు ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పను డిమాండ్ చేశారు.