హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎకో టూరిజంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా 15 ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి చేయబడ్డాయి. సోమశిల రిజర్వాయర్, సింగోటం రిజర్వాయర్, అక్కమహాదేవి గుహాలు, ఈగలపెంట, మన్ననూరు, మల్లెలతీర్థం, ఉమామహేశ్వరం, లక్నవరం, మేడారం, తాడ్వాయి, పాకాల, ఆలీసాగర్ వద్ద ఎకో పార్కులను అభివృద్ధి చేశామన్నారు. మహబూబ్నగర్ సమీపంలో 2,097 ఎకరాల్లో కేసీఆర్ ఎకో పార్కును అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు.
గతంలో టూరిజం స్పాట్లను వ్యాపార కేంద్రాలుగా మార్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం.. టూరిజం ద్వారా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. టూరిజం పేరుతో ఉమ్మడి ఏపీలో విలువైన భూములు కబ్జా చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అచ్చంపేట, సోమశిలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటును అందుబాటులోకి తెచ్చామన్నారు. రిజర్వాయర్లు నిర్మించిన ప్రాంతాల్లో టూరిజాన్ని అభివృద్ధి చేసి పర్యాటకుల కోసం బోట్లు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఉమామహేశ్వరం ఆలయం వద్ద పార్కుతో పాటు ట్రెక్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
త్వరలోనే ఫారెస్ట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి.. నల్లమలలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పాకాల చెరువు వద్ద ఇప్పటికే కొంత అభివృద్ధి చేశాం.. త్వరలోనే ఆ ప్రాంతాన్ని సందర్శించి మరింత అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కోయిల్సాగర్, సరళాసాగర్, మిడ్మానేరుతో పాటు మిగతా రిజర్వాయర్ల వద్ద ఎకో టూరిజం పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణను టూరిజం హబ్గా తయారు చేసే దిశలో ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.