చండీగఢ్: కుటుంబ పరిస్థితుల వల్ల బడి మానేసి సాక్సులు అమ్ముతున్న పంజాబ్ బాలుడు ఆ రాష్ట్ర సీఎం దృష్టిలో పడ్డాడు. దీంతో చదువుకోవాలని సూచిస్తూ ఆ బాలుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. లుధియానాకు చెందిన పదేండ్ల వన్ష్ సింగ్ రెండో తరగతి నుంచే స్కూల్ మానేశాడు. కుటుంబానికి సహాయంగా ఉండేందుకు ట్రాఫిక్ కూడళ్ల వద్ద సాక్సులు అమ్ముతున్నాడు. కొందరు సహాయంగా ఎక్కువ డబ్బులు ఇచ్చినా తీసుకునేవాడు కాదు.
మరోవైపు ఒక వ్యక్తి తీసిన ఆ బాలుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయన ఫోన్లో వీడియో కాల్ ద్వారా వన్ష్ సింగ్తో మాట్లాడారు. అతడి కుటుంబ ఖర్చుల గురించి తాను పట్టించుకుంటానని, చక్కగా చదువుకోవాలని ఆ బాలుడికి చెప్పారు. అంతేగాక ఆ బాలుడు బడిలో చదువుకునేలా చూడాలని, ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.2 లక్షలు అందజేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఈ విషయాన్ని సీఎం అమరీందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా శనివారం వెల్లడించారు.