న్యూఢిల్లీ : తెలుగు రాష్ర్టాల్లోని అన్నదాతలందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి భూమిని పూజించే సంప్రదాయం మనది అని ట్వీట్లో పేర్కొన్నారు. వర్ష ఋతువు ఆరంభమయ్యే జ్యేష్ఠ పౌర్ణమి నాడు భూమిని పూజించడమే గాక వ్యవసాయానికి ఆధారమైన పశుసంపద రోగాల బారిన పడకుండా పలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారు అని తెలిపారు.
మా చిన్నతనంలో ఏరువాక పౌర్ణమిని ఊరంతా పండుగలా జరిపేవారు అని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. భారతీయ సంప్రదాయం ప్రతి పనిని యజ్ఞంగానే భావించింది. అందుకే ఏరువాక సైతం రైతులకు సంప్రదాయ ఉత్సవమైంది. వేల ఏళ్ళుగా సాగుతున్న ఇలాంటి సంప్రదాయాల గురించి యువత తెలుసుకుని రైతన్నల శ్రమశక్తిని గౌరవించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ఉప రాష్ర్టపతి పేర్కొన్నారు.