న్యూఢిల్లీ: అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమస్యల పరిష్కారంలో యువత చొరవచూపించాలని సూచించారు. యోగాతోపాటు క్రీడలపై యువతరం మరింత దృష్టిసారించాలన్నారు. మాతృభాషను కాపాడుకోవడంతోపాటు దేశ భద్రతపై దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రతి ట్వీట్ చేశారు.
‘అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. యువత తమలో దాగి ఉన్న శక్తిసామర్థ్యాలను వెలికితీసి వాటికి వినూత్నమైన ఆలోచనలను జోడించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాను. కులవివక్ష, అవినీతి, వరకట్నం, నిరక్షరాస్యత మొదలైన సామాజిక రుగ్మతలను తొలగించే ఉద్యమాన్ని యువత ముందుండి నడిపించాలి. మొక్కలు నాటడం, పర్యావరణ మార్పుల ద్వారా ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలో చొరవచూపించాలి. శారీరక దారుఢ్యం, యోగతోపాటు క్రీడలపై యువతరం మరింత దృష్టిసారించాలి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం, మాతృభాషను కాపాడుకోవడంతోపాటు దేశ భద్రత మీద దృష్టి కేంద్రీకరించి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని వెంకయ్య ట్విట్టర్లో పోస్టు చేశారు.