హసన్పర్తి, మే 14 : దారి దోపిడీకి పాల్పడిన నలుగురు దుండగులను శుక్రవారం హసన్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ కథనం ప్రకారం.. ఖిలావరంగల్కు చెందిన నల్ల కృష్ణరాజన్, బైరబోయిన శ్రీకాంత్, పూసల అనురాగ్, వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి ప్రవీణ్ గత నెల 5న బైరాన్పల్లిలో రోడ్డుపై వస్తున్న ఓ వ్యక్తిని కొట్టి, అతడి వద్ద ఉన్న బంగారు గొలుసు, ఫోన్, నగదును బలవంతంగా లాక్కెళ్లారు. అలాగే, గత నెల 14న పైడిపల్లిలో ఓ ఇంటి ముందు పెట్టిన బైక్ను ఎత్తుకెళ్లారు. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో శుక్రవారం ఎస్సై జితేందర్రెడ్డి సిబ్బందితో పైడిపల్లి తాళ్లగూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బైక్లపై వస్తున్న ఈ నలుగురు యువకులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారి ని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టగా చేసిన నేరాలను ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రెండు బైక్లు, బంగారు గొలుసు, రూ.3 వేల నగదు, మొ త్తం రూ.1.72 లక్షల సొత్తును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. కాగా, కేసులో ప్రావీణ్యం చూపిన ఎస్సై జితేందర్రెడ్డి, క్రాంతికుమార్, ప్రవీణ్, వెంకన్న, పోలీస్ సిబ్బందిని ఏసీపీ రవీంద్రకుమార్, సీఐ శ్రీధర్రావు అభినందించారు.