న్యూఢిల్లీ: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులను దేవుడితో సమానంగా గౌరవించడమే మన సంస్కృతి అని అన్నారు. నిరంతర నిస్వార్ధ సేవలు అందిస్తున్న వైద్యులకు ప్రణామాలు చేస్తున్నాని, వైద్యులు, వారి కుటుంబ సభ్యులపై కరోనా.. తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిందని, అయినప్పటికీ చిత్తశుద్ధితో కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని సూచించారు. ఈ మేరకు వెంకయ్య ట్వీట్ చేశారు.
‘జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. వైద్యులను భగవంతుడితో సమానంగా గౌరవించమని భారతీయ సంస్కృతి చెబుతోంది. వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరంతరాయంగా నిస్వార్థ సేవలు అందిస్తున్న వైద్యులందరికీ ఈ సందర్భంగా ప్రణామాలు అర్పిస్తున్నాను. కోవిడ్ మహమ్మారి వైద్యులు, వారి కుటుంబ సభ్యుల మీద తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది. అయినా వారు చిత్తశుద్ధితో తమ కర్తవ్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ, వైద్యులపై ఒత్తిడిని తగ్గించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్విట్టర్లో పోస్టు చేశారు.