సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): పోలీసులంటేనే ‘అవినీతి, దోపిడీ, ఇష్టా రాజ్యంగా వ్యవహరించే తీరు’ అనే ముద్ర నుంచి, పోలీసులంటే.. ఒక భరోసా, భద్రత అనే స్థాయికి రాచకొండ పోలీసులు తీసుకువచ్చి ప్రజల్లో ప్రతిష్టను పెంచుకున్నారు. ప్రజల్లో అనాదిగా పడిపోయిన ముద్రను రాచకొండ పోలీసులు తొలగించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ ఏర్పాటై రేపటికి సరిగ్గా ఐదేండ్లు పూర్తి చేసుకుంటుంది. 2016 జూలై 1 నుంచి ప్రారంభమైన ఈ పోలీసు కమిషనరేట్తో ఐదేళ్లలో ఇక్కడి ప్రాంతాలు, ప్రజల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామీణం, పట్టణం, పాత బస్తీ సంప్రదాయాలు కలబోసిన ప్రజలు ఈ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్నారు. పలు సవాళ్లతో ప్రారంభమైన ఈ కమిషనరేట్ వాటన్నింటిని అధిగమిస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రజలకు అందిస్తూ కీర్తిని ఆర్జిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు పోలీసు సేవలు ఎనిమిది నిమిషాల్లో అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు కావడంతో నేరం చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి స్థానికంగా ఏర్పడింది. దీంతో ప్రజలకు భద్రతపై పూర్తి భరోసా లభించింది.
ఐదేళ్లలో దశల వారీగా పోలీసులు కల్పించిన అవగాహన, నిర్వహించిన కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంత ప్రజల జీవన శైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. బాల్య వివాహాలను చేయరాదని, బాలికలపై తీవ్ర అనారోగ్య సమస్యలను ఈ తంతు మోపుతుందని ప్రజలు తెలుసుకున్నారు. ఇత్యాది వివాహాలకు గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు దూరంగా ఉంటున్నాయి. తండాలలో నెలకొన్న మూఢ నమ్మకాలు క్రమంగా తగ్గిపోయాయి. అక్కడ సమాచార వ్యవస్థ కూడా మెరుగుపడటంతో ప్రజలు అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నడిచే మనుషుల అక్రమ రవాణ, కల్తీ విత్తనాల విక్రయాలు, గ్యాబ్లింగులు అడ్డాలు లేకుండా కట్టడి చేస్తున్నారు. నేరం చేస్తే శిక్ష తప్పదనే సంకేతాన్ని ఇస్తూ జరుగుతున్న పోలీసు దర్యాప్తు తాజా నేరస్థుల్లో వణుకు పుట్టిస్తోంది. ఇలా నేరస్థులకు శిక్షపడే అంశాల్లో 55 శాతం ఫలితాలను సాధించి రాచకొండ పోలీసు కమిషనరేట్ రాష్ట్రంలోనే నెం.1గా నిలించింది.
ఇక పట్టణ ప్రాంతాలకు వస్తే వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిని కట్టడి చేశారు. గ్యాంగ్స్టర్ లాంటి మాటలను వినపడకుండా చేశారు. పీడీ యాక్ట్లతో గూండాల వ్యవహరాలను మూసేశారు. కాలేజీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ‘షీ ఫర్ హర్’ వాలంటీర్లను ఏర్పాటు చేసి వారి వద్దకే పోలీసింగ్ను అందిస్తున్నారు. ఐటీ కారిడార్లో మార్గదర్శక్లతో ఉద్యోగినిల వేధింపులకు చెక్ పెట్టారు. ‘మై ఆటో/క్యాబ్ ఈజ్ సేఫ్’తో సురక్షిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం, ఈ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 48 లక్షల జనాభా నివసిస్తోంది. ఎల్బీనగర్, మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి డీసీపీ జోన్లలో మొత్తం 45 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. వీటితో పాటు ఎస్ఓటీ, సీసీఎస్, సైబర్ క్రైం, ఉమెన్ పీఎస్ విభాగాలు కూడా ఉన్నాయి. ప్రజలు, ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో కమిషనరేట్ పరిధి ఒక గొడుగు కిందకు వచ్చేసింది. వీటి ద్వారా నిఘా ముమ్మరంగా పెరిగింది. కరోనాతో పాటు వరదల సమయంలో పోలీసులు అండగా నిలబడటంతో ప్రజలు వారి సేవలకు చాలా సందర్భాల్లో సెల్యూట్ చేశారు. ఇలా రాచకొండ పోలీసు కమిషనరేట్ ప్రజల్లో తనదైన ముద్రను వేసుకుంది.
విస్తీర్ణంలో దేశంలోనే అత్యంత పెద్ద పోలీసు కమిషనరేట్కు నాపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి, డీజీపీ పోలీసు కమిషనర్గా నియమించారు. ఐదేండ్లుగా ఒక టీమ్ వర్క్ కింద అందరం కలిసి పని చేసి కమిషనరేట్ పరిధిలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాం. ప్రజల భాగస్వామ్యంతో నేరాలను కట్టడి చేశాం. పోలీసు సేవలను వేగంగా అందించాం. పలు తండాలను దత్తత తీసుకుని వారిలో చైతన్యం కల్పించి ఆధునిక జీవనంలోకి తీసుకువచ్చాం. 106 బాల్య వివాహాలను ఆపాం. మనుషుల అక్రమ రవాణాను అరికట్టి అమాయకులను కాపాడాం. ఇట్టుక బట్టీల వద్ద వర్క్సైట్స్ పాఠశాలలను ఏర్పాటు చేశాం. రోడ్డును చూడని తండాలకు ఆరు కిలోమీటర్ల వరకు రోడ్డులు వేశాం. నేరం చేస్తే శిక్ష తప్పదని కేసులతో స్పష్టం చేశాం. పోటీ పరీక్షల్లో యువత రాణించేలా సహకరించాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడ్డాం. ప్రమాదకరమైన సవాళ్లను అధిగమించాం.-మహేష్ భగవత్, కమిషనర్, రాచకొండ పోలీసు కమిషనరేట్