హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభ, శాసనమండలి నిర్వహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణ వంటి పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసుశాఖ ఉన్నతాధికారులతో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాసనసభ భవనంలోని సభాపతి కార్యాలయం, కమిటీ హాల్లో జరిగిన ఈ సమావేశానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనమండలి చీఫ్ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహాచార్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ… రానున్న అసెంబ్లీ సమావేశాలు విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు అవాంతరాలు లేకుండా సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈసారి కూడా సమావేశాలలో నిబంధనలు పాటించడం జరుగుతుందన్నారు. పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ ల ద్వారా అసెంబ్లీ సమావేశ మందిరంలో, పరిసరాలలో శానిటైజేషన్ కార్యక్రమాలు రోజుకు రెండుసార్లు చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రతి సభ్యుడు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం ర్యాపిడ్ టెస్ట్లు చేయనున్నట్లు తెలిపారు. సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. శుక్రవారం సాయంత్రం నుండే పరీక్షలు చేయడం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ్యులు, మండలి సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, మంత్రుల సిబ్బంది, అసెంబ్లీ మార్షల్స్ అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ రిపోర్టు వస్తే ఎవరూ కూడా సభా కార్యకలాపాలకు హాజరుకావొద్దన్నారు.
అధికారుల సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్, చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడీ) రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్), ఎస్సీఎం రిజ్వీ, ప్రిన్సిపల్ సెక్రటరీ (హెల్త్ డిపార్ట్మెంట్), జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి పాల్గొన్నారు.
పోలీసుశాఖ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, డీజీ(ఎస్పీఎఫ్) హాం సెక్రటరీ రవి గుప్తా, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఇంటలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు, అడిషనల్ సీపీ ట్రాఫిక్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబరాబాద్), అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా & ఆర్డర్), అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్ హాజరయ్యారు.